న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన చార్టర్డ్ అకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పేపర్ల పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ … దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పోలింగ్ రోజున ఏ పరీక్షను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. తేదీలను మార్చడం వల్ల పరీక్ష నిర్వహణకు ఇప్పటికే చేస్తున్న విస్తఅత ఏర్పాట్లకు విఘాతం కలుగుతుందని, ఫలితంగా ఎంతోమంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సుప్రీం అభిప్రాయపడింది. పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొంటూ పిల్ను విచారించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
పోలింగ్ తేదీల్లో పరీక్షలు లేవు : సుప్రీం
సీఏ పరీక్షలు మే 2 నుంచి మే 17వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 591 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. దాదాపు 4 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షల కోసం నమోదు చేసుకున్నారు. అయితే, మే 7, మే13 న పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుండగా, మే 8, 14న జరగనున్న పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పిల్ దాఖలైంది. దీనిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. పోలింగ్ తేదీల్లో పరీక్షలు లేనందున ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంటూ పిటిషన్ను తోసిపుచ్చింది.
సార్వత్రిక ఎన్నికల వల్ల పరీక్షలకు ఇబ్బంది లేదు : ఢిల్లీ హైకోర్టు
ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఏప్రిల్ 8న ఓ పిటిషన్ దాఖలు కాగా.. పిటిషనర్ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దాదాపు 4.26 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షల కోసం నమోదు చేసుకున్నారని, కేవలం కొద్ది మంది అభ్యర్థన కోసం వీటిని మార్చలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన పరీక్షల తేదీలకు సార్వత్రిక ఎన్నికల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా న్యాయస్థానానికి తెలియజేసింది.