రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు : సిజెఐకి 600 మంది న్యాయవాదుల లేఖ

న్యూఢిల్లీ : దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థ సమూహాలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ప్రముఖ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, పింకీ ఆనంద్‌, బార్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా సహా 600 మందికి పైగా న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ లేఖ రాయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘రాజకీయ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని స్వార్థ సమూహాలు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నాయి. వీరు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు’ అని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
‘కొందరు రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత ఆరోపణలు చేసినవారినే కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. న్యాయవ్యవస్థలకు హాని చేయాలనుకునే వారికి మరింత బలం ఇచ్చినట్లే. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం” అని న్యాయవాదులు తమ లేఖలో కోరారు.

ఇతరులను బుజ్జగించడం, బెదిరించడం కాంగ్రెస్‌ సంస్కృతి : మోడీ
భారత ప్రధాన న్యాయమూర్తికి 600 మంది న్యాయవాదులు లేఖ రాసిన అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇతరులను బుజ్జగించడం, బెదిరించడం కాంగ్రెస్‌ సంస్కృతి అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఇతరులను బుజ్జగించడం, బెదిరించడం కాంగ్రెస్‌ సంస్కృతి. అయిదు దశాబ్దాల క్రితమే వారు (కాంగ్రెస్‌) కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను సిగ్గులేకుండా కోరుకుంటారు. దేశంపై మాత్రం ఎటువంటి నిబద్ధతను ప్రదర్శించడానికైనా దూరంగా ఉంటారు’ అని అని తెలిపారు.

➡️