కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించిన ఐరాస

ప్రజల హక్కుల రక్షణపై ఆశాభావం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టుపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ బదులిస్తూ ‘భారత్‌ సహా ఎన్నికలు జరిగే ఏ దేశంలో అయినా రాజకీయ, పౌర హక్కులు సహా ప్రజలందరి హక్కులకు రక్షణ లభిస్తుందని మేము ఆశిస్తున్నాము. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాము’ అని చెప్పారు.
కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా, జర్మనీ ఇదివరకే స్పందించాయి. స్వేచ్ఛగా, పారదర్శకంగా, సకాలంలో చట్టపరమైన ప్రక్రియ జరగాలని తాను భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ వ్యాఖ్యానించారు. తన బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారని, దీంతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం సవాలుగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణల గురించి కూడా తమకు తెలుసుననిó మిల్లర్‌ పేర్కొన్నారు.
కేేజ్రీ అరెస్టుపై జర్మనీ స్పందిస్తూ ‘న్యాయ వ్యవస్థ స్వతంత్రత, మౌలిక ప్రజాస్వామిక సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసుకు కూడా వర్తిస్తాయని మేము భావిస్తున్నాం’ అని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తుల మాదిరిగానే కేజ్రీవాల్‌ కూడా నిష్పాక్షిక, స్వేచ్ఛాయత విచారణకు అర్హుడని వ్యాఖ్యానించింది. దేశీయంగానే గాకుండా అంతర్జాతీయంగా కూడా విమర్శలు వస్తుండడంతో బిజెపితీవ్ర ఇరకాటంలో పడింది. దీంతో అది బుకాయింపులు, ఎదురుడాడికి దిగింది.

➡️