ప్రజా పక్షపాతి బాలకృష్ణ-మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ

Feb 2,2024 08:12 #cpm leader, #samsmarana sabha

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేసిన ప్రజల పక్షపాతి సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ బాలకృష్ణ అని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ కొనియాడారు. విశాఖ డాబాగార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యాన డాక్టర్‌ బి గంగారావు అధ్యక్షతన ఎ బాలకృష్ణ సంతాప సభ గురువారం నిర్వహించారు. బాలకృష్ణ చిత్రపటానికి ఎంవిఎస్‌ శర్మ, జివిఎన్‌ చలపతి, ఎస్‌ సుధాకర్‌, ఎం జగ్గునాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ.. విశాఖపట్నం విద్యార్థి ఉద్యమంలో బాలకృష్ణ చురుకైన పాత్ర పోషించారని, పార్టీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నంలో కార్మికుల సమస్యలపైనా, రైతు, వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయడంలోనూ ప్రజలతో మమేకమై పనిచేసేవారని చెప్పారు. బాలకృష్ణ ఉద్యమకారునిగా, కార్మిక, కర్షక పక్షపాతిగా విశాఖ జిల్లాలో పేరు సంపాదించుకున్నారని గుర్తుచేశారు. ఆయన నమ్మిన సిద్ధాంతం బాటలో భార్య, పిల్లలూ ఉన్నారన్నారు. దోపిడీ లేని వ్యవస్థను స్థాపించాలనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి కుమార్‌, బి జగన్‌, బి పద్మ, బట్టా ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️