రాష్ట్రంలో 18 నుంచి పదవ తరగతి పరీక్షలు

Mar 14,2024 10:38 #Exams, #Tenth

హైదరాబాద్‌ :పదో తరగతి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుతించేందుకు ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించింది. ఇంతకు మించి లేటుగా వస్తే మాత్రం పరీక్ష కేంద్రంలోకి పంపించబోమని స్పష్టం చేసింది. ఈ నెల18 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చివరి నిమిషంలో ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందుగానే ఎగ్జామ్‌ సెంటర్లకు రావాలని బోర్డు సూచించింది. గతంలోలా ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా చూసేందుకు బోర్డు పలు చర్యలు తీసుకుంది. పేపర్‌ కోడ్‌, సబ్జెక్టు, మీడియం వంటివి తప్పుగా వచ్చినట్టైతే వెంటనే చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులను సంప్రదించాలని సూచించింది.

పొరపాట్లు ఇక్కడే..

తెలుగు పరీక్ష రోజున ప్రశ్నపత్రాలు తారుమారయ్యే అవకాశాలు ఉంటున్నాయి. పదో తరగతి రెగ్యులర్‌ విద్యార్థులకు 10టీ, 02టీ కోడ్‌ ఉన్న పేపర్లకు 80 మార్కుల పరీక్ష నిర్వహిస్తున్నారు. అదే రోజు కాంపోజిట్‌ కోర్సు తెలుగు విద్యార్థులకు 60 మార్కులకు 03టీ కోడ్‌ పేపర్‌ పరీక్ష ఉంటోంది. ఈ రెండు పేపర్ల పంపిణీలో ఇన్విజిలేటర్లు గందరగోళానికి లోనవుతున్నారు. ఉర్దూ విషయంలోనూ ఈ సమస్య ఉంది. సమస్యకు పరిష్కారంగా కాంపోజిట్‌ ప్రశ్న పత్రాలను కలర్‌ పేపర్‌పై ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.

➡️