హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ (ఆహార భద్రత) కార్డు ఉన్నవారినే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా.. లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషన్కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లతో ఆదివారం నిర్వహించే కాన్ఫరెన్స్లో ఈ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.