ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత కర్నూలు జిల్లాలో నమోదైంది. జి సింగవరంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3, కడప జిల్లా బలపనూరులో 45.9 డిగ్రీలు, విజయనగరం జిల్లా రాజాంలో 45.3 డిగ్రీలు, అనకాపల్లిలోని రావికమతంలో 44.8 డిగ్రీలు, అనంతపురం జిల్లా బొప్పేపల్లెలో 44.7, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.6 డిగ్రీలు చొప్పున, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, నెల్లూరు జిల్లా వేసివాసి అక్కమాంబపురంలో 44.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 83 మండలాల్లో వడగాడ్పులు నమోదయ్యాయి. బుధవారం కూడా ఇదే రీతిలో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్డి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టిఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, కడప జిల్లాల్లో 46 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందన్నారు. అలాగే కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో 44 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు.