ఎంపి స్థానం కేటాయించడంపై అసంతృప్తి
ప్రజాశక్తి – పిచ్చా టూరు: (తిరుపతి జిల్లా) : గ్రావెల్, ఇసుకతో సహా అన్ని పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయని.. చెడ్డపేరును మాత్రం తనకు ఆపాదించారని చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టం లేకపోయినా తనను తిరుపతి పార్లమెంట్ స్థానానికి సమన్వయకర్తగా నియమించారని తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతోనే అన్ని చేశానని, తన పాత్ర ఏమీ లేదన్నారు. నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా ఆత్మీయ సమయాన్ని తిరుపతిలో నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ఇతర జనరల్ నియోజకవర్గాల్లో ఇలా మీరు చేస్తారా? అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. కేవలం దళిత నియోజకవర్గంలోనే ఇలా వ్యవహరించడం పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కాదా? అని మండిపడ్డారు. మీరు ఎక్కడ సమావేశం పెడితే అక్కడికి నాయకులు రావాలని మీ ఉద్దేశమా? ఇప్పటికీ తనకు పార్టీ అన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నా ఇష్టమని పేర్కొన్నారు. తనమీద అభిమానంతో సిఎం తనను ఎంపి స్థానానికి పంపించారని అందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. కాగా శనివారం తిరుపతిలో జరిగిన వైసిపి సత్యవేడు నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనానికి ఆదిమూలం డుమ్మా కొట్టారు.