‘అన్నమయ్య’ బాధితులకు న్యాయం చేస్తాం : నారా లోకేష్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య జిల్లా) : యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై నేరుగా వారి కష్టనష్టాలు తెలుసుకున్నానని, వారికి సమన్యాయం చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని విద్యానగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన యువగళం బహిరంగ సభలో యువతతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి లోకేష్‌ మాట్లాడుతూ వైసిపి అడ్డగోలు విధానాల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రాక, ఉన్న పరిశ్రమలు సైతం ఇతర ప్రాంతాలకు తరలి యువత నిరుద్యోగులుగా మిగిలారని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. హత్య రాజకీయాలకు టిడిపి దూరంగా ఉంటుందని, అలాంటి రాజకీయాలను ప్రోత్సహించరాదని యువతను కోరారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసిపి పాలకుల వల్ల రాజంపేట నియోజకవర్గం అన్ని విధాల వెనుకబడిందని, ఇసుకాసురుల ధనదాహానికి అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి వందల కుటుంబాలు వీధిన పడ్డాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలోనే అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణాం ప్రారంభిస్తామని, వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం కొనసాగిస్తూనే అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. రాజంపేట నియోజకవర్గంలో యువతతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో రానున్నది టిడిపి ప్రభుత్వమేనని, రాజంపేట నియోజకవర్గంలోనూ తమ పార్టీ జెండా రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం, పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌ మోహన్‌ రాజు, పార్టీ నాయకులు సుగువాసి ప్రసాద్‌ బాబు, టి లక్ష్మీనారాయణ, నాగోతు రమేష్‌ నాయుడు, వేమన సతీష్‌, గన్నె సుబ్బనసయ్య, సుబ్రహ్మణ్యం నాయుడు, పోలీ శివకుమార్‌ పాల్గొన్నారు.

➡️