కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్రలు

Mar 25,2024 21:35 #ap congress, #press meet, #vizag

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి దండి ప్రియాంక విమర్శించారు. సోమవారం విశాఖలోని విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు అకౌంట్‌ను నిలిపివేయడమే అందుకు నిదర్శనమన్నారు. కేంద్ర విచారణ సంస్థలైన ఇడి, సిబిఐలను బిజెపి పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. వాటిని వ్యాపార, పారిశ్రామికవేత్తలపై ప్రయోగించి ఎలక్టోరల్‌ బాండ్స్‌ రూపంలో రూ. వేల కోట్ల నిధులను అక్రమంగా సమకూర్చుకుందని విమర్శించారు. బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడే నాయకులపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని, ఆ పార్టీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా జతకట్టిన టిడిపి, జనసేన, వైసిపిలను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వజ్జసర్తి శ్రీనివాస్‌, గుత్తుల శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు పాశర్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️