విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించడంలేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కోాకన్వీనర్ జె.అయోధ్యరాం అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 1141వ రోజుకు చేరాయి. దీక్షలో స్టీల్ప్లాంట్ ట్రాఫిక్, ఆర్ఎండి, కన్స్ట్రక్షన్ విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ.. కార్మికులను మానసికంగా కృంగతీయటానికి కూడా కేంద్రంలోని బిజెపి అనేక కుట్రలు పన్నుతోందని, ఈ చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మికులు చేస్తున్న ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, నిర్వాసితులు అంతా కలిసి ఐక్యంగా పోరాటంలో పాల్గనాలని కోరారు. స్టీల్ప్లాంట్ను కాపాడే వారికే రానున్న ఎన్నికల్లో ఓటు వేస్తామని రాజకీయ పార్టీలకు హెచ్చరికలు పంపాలన్నారు.