ప్రజాశక్తి-విజయవాడ : నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడి నాయకులతో పాటు వేలాది అంగన్వాడీ ఉద్యోగులను అర్ధరాత్రి అమానుషంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో డిసిపి విశాల్ గున్ని నాయకత్వంలో వందలాది మంది పోలీసులు టెంట్ ను పీకెసి, కరెంట్ తీసేసి దీక్షలో ఉన్న వారి పట్ల కనికరం కూడా చూపకుండా, మహిళలని కూడా చూడకుండా అమానుషంగా వ్యవహరించారని తెలిపారు. మగ పోలీసులే మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం చట్ట విరుద్ధమని ఆగ్రహించారు. మీడియా పట్ల కూడా దురుసుగా వ్యవహరించడం దారుణమన్నారు. సమస్యను సామరస్య పూర్వకంగా చర్చించి పరిష్కరించకుండా అంగన్వాడీ మహిళా ఉద్యమాన్ని అమానుషంగా అణచివేయడం దారుణమని ద్వజమెత్తారు. తక్షణం వారిని విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అమనుషానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడే నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
జగనన్నకు చెబుదాం అని మీరే అన్నారు. ఇప్పుడు ఈ అరెస్టులు ఎందుకు?