-ఎఎంసికి భౌతికకాయం అప్పగింత
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అనకాపల్లి విలేకరి :సిపిఎం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, ఎపి కౌలు రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అంగులూరి బాలకృష్ణ (65) అనారోగ్యంతో విశాఖ కెజిహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని అనకాపల్లిలోని దాసరిగెడ్డ రోడ్డు గవరపాలెంలో ఉన్న స్వగృహానికి తరలించారు. అక్కడి నుంచి సిపిఎం జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తీసుకొచ్చారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం విశాఖపట్నం జగదాంబ సమీపంలోని సిపిఎం కార్యాలయానికి తీసుకొచ్చి కొద్దిసేపు ఉంచారు. ఆ తర్వాత ఆంధ్రా మెడికల్ కాలేజీకి భౌతికకాయాన్ని అప్పగించారు. ఆయనకు భార్య వరలక్ష్మి, కుమారుడు వెంకట సత్యప్రసాద్ (కౌశిక్) ఉన్నారు.
- ఉద్యమాలు
బాలకృష్ణ పలు ఉద్యమాల్లో చురుకుగా వ్యవహరించారు. ప్రధానంగా నల్ల బెల్లం, రైవాడ, కౌలు రైతు రుణాలు, వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు, వృత్తిదారుల రుణాలు, రైతు ఉద్యమాలు, ధరల పెంపుదల, రైతు వ్యతిరేక చట్టాలపై, కౌలు రైతుల గుర్తింపు కార్డులు, భూ పంపిణీ, ల్యాండ్ పోలింగ్, మున్సిపాలిటీ ఇంటి పన్నులు, మునిసిపల్ కార్మికులు, స్కీం వర్కర్ల సమస్యలు, ముఠా వర్కర్ల సమస్యలు వంటి అనేక సమస్యలపై పోరాడారు. ప్రజా సమస్యలపై అది కూడా స్పందించేవారు. ఇటీవలే పార్టీకి చెందిన మరో కీలక నేత, తన సహచరుడు కామ్రేడ్ మల్ల సత్యనారాయణ మృతి చెందడం, దీంతో తీవ్రంగా బాలకృష్ణ కలత చెందారు. బాలకృష్ణ మృతితో ఒక ఉద్యమ నేతను కోల్పోయామని పలు కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.