ప్రజాశక్తి-అమరావతి :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా ఆయన కుమార్తె సునీత, ఎపిసిసి అధ్యక్షులు షర్మిలను నిలువరించాలంటూ, వారి ప్రసంగాలను ప్రచురించకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్రావుతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. గుంటూరు జిల్లా తొట్టెంపూడికి చెందిన చిర్రా శ్రీనివాసరెడ్డి ఈ పిల్ దాఖలు చేశారు. అభ్యంతరం ఎవరికుంటే వారు కోర్టుకు వస్తారని, వారి వ్యాఖ్యలపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులే కోర్టును ఆశ్రయిస్తారని ధర్మాసనం పేర్కొంది. ‘ఎన్నికల్లో పోటీ చేసేవారికి లేని బాధ మీకెందుకు’ అని పిటిషనరును ప్రశ్నించిన అనంతరం పిటిషన్ను డిస్మిస్ చేసింది.