- నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
- మే 8న పరీక్ష : చైర్మన్ శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం జెఎన్టియు, ఎపి ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎపిఇసెట్-2024 నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం జెఎన్టియు ఉపకులపతి, ఎపిఇసెట్ చైర్మన్ జివిఆర్.శ్రీనివాసరావు వెల్లడించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎలాంటి రుసుం లేకుండా ఒసి విద్యార్థులు రూ.600, బిసి విద్యార్థులు రూ.550, ఎస్సి, ఎస్టి విద్యార్థులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు, రూ.2000 అపరాధ రుసంతో ఏప్రిల్ 29 వరకు, రూ.ఐదు వేలు అపరాధ రుసుంతో మే రెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మే ఒకటి నుంచి ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. మే ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీ, బిఎస్సి గణితం, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటలు నుంచి సాయంత్రం 5.30 గంటలకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్టూమెంటేషన్, మెకానికల్, మైనింగ్, మెటలార్జికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.