వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

Mar 28,2024 20:40 #Prakasam District, #road accident

– ముగ్గురు దుర్మరణం
ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. ఈ సంఘటన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం జాతీయరహదారిపై గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం గుర్రంవారిపాలెంకు చెందిన రాయని అరుణ(50) కుమార్తె వివాహం తెలంగాణ రాష్ట్రం పాల్వంచకు చెందిన వ్యక్తితో బుధవారం రాత్రి భద్రాచలంలో జరిగింది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి వేడుకలో పాల్గన్నారు. వివాహం అనంతరం పెళ్లి కుమార్తె తల్లి అరుణ, తన బంధువులతో కలిసి సొంతూరుకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం జాతీయ రహదారి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకున్నారు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టి ఫ్లైఓవర్‌ నుండి కింద పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అరుణ, తల్లపనేని దివ్య (28), గుళ్ళాపల్లి శ్రావణి (22) అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి కుమార్తె సోదరుడు రాయని వేణు, డ్రైవర్‌ తల్లపనేని వినోద్‌, ఆయన కుమారుడు అభిలాష్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని శింగరాయకొండ సిఐ దాచేపల్లి రంగనాథ్‌ తెలిపారు.

➡️