- 1,04,836 మంది డేటా అప్లోడ్ కాలేదు : నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : వలంటీర్ వ్యవస్థకు చట్టబద్దతే లేదని, ఆ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోందని జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. తెనాలి బోస్ రోడ్డులోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికి తిరిగి ప్రజల వ్యక్తిగత డేటా సేకరిస్తున్న వలంటీర్ను ప్రభుత్వ పరంగా ఎవరు అనుమతించారు? వారు సేకరిస్తున్న డేటాను ఎక్కడ భద్రపరుస్తున్నారు? వలంటీర్ వ్యవస్థను పర్యవేక్షించే అధికారం ఎవరిదని ప్రశ్నించారు. దీనిపై ప్రశ్నించినందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసులు నమోదు చేశారని, ఆ కేసులకు భయపడేది లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతిపై కచ్చితంగా దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు, బండారు రవికాంత్, ఇస్మాయిల్ భేగ్, దివ్వెల మధుబాబు, జాకీర్ పాల్గొన్నారు.