కవిత పిటిషన్‌ విచారణ వాయిదా

Apr 10,2024 23:51 #Delhi liquor case, #ED, #Kavitha

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తనను సిబిఐ విచారించడాన్ని సవాల్‌ చేస్తూ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ ను రౌస్‌ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఈనెల 26న ఈ పిటిషన్‌ పై విచారణ చేపడతామని పేర్కొంది. తీహార్‌ జైళ్లో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ… గత వారం సిబిఐ అధికారులు స్పెషల్‌ కోర్టులో అప్లికేషన్‌ దాఖలు చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా కవితను జైళ్లోనే విచారించేందుకు అనుమతిచ్చారు. అయితే, జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ మరుసటి రోజు ఈనెల 6న కవిత తరపు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. కవితను సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై స్టేటస్‌ కో ఉత్తర్వులు న్యాయమూర్తిని కోరారు. సిబిఐ తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని న్యాయమూర్తికి వివరించారు. కవితను ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. బుధవారం ఈ పిటిషన్‌ పై స్పెషల్‌ జడ్జ్‌ కావేరి బవేజా మరోసారి విచారణ చేపట్టారు. అయితే కోర్టు ఆదేశాలతో గత శనివారమే కవితను విచారించినట్లు సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పై కౌంటర్‌ ఫైల్‌ చేయలేమని కోర్టుకు నివేదించారు. కవిత తరపు న్యాయవాది మోహిత్‌ రావు జోక్యం చేసుకొని, కవిత విచారణపై సిబిఐ తమకు ఎలాంటి సమాధానం అందించలేదన్నారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్న న్యాయమూర్తి… భవిష్యత్‌ లో సిబిఐ చేపట్టే విచారణకు ముందస్తుగా అప్లికేషన్‌ ఇవ్వమని అడగాలని కవిత న్యాయవాదులకు సూచించారు. అయితే, సిబీఇఐ రిప్లై ఇవ్వకపోవడం పై తమ వాదనలు వినిపిస్తామని మోహిత్‌ రావు కోర్టును అభ్యర్థించారు. ఇందుకు అనుమతించిన కోర్టు… తదుపరి విచారణను ఏప్రిల్‌ 26 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

➡️