చిలకలూరిపేటలో మల్లెల మద్దతుదారుల నిరసన

Mar 13,2024 21:45 #candidates, #Dharna, #palanadu, #YCP
  • రాజేష్‌ నాయుడును కొనసాగించాలని డిమాండ్‌

ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసిపి కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్న మల్లెల రాజేష్‌ నాయుడును తొలగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అనుచరులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మంత్రి రజినికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిలకలూరిపేట సమన్వయకర్తగా రాజేష్‌ నాయుడును కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. నగరంలోని బ్యాంకు కాలనీలో ఉన్న మల్లెల కార్యాలయం నుండి బయలుదేరిన ర్యాలీని మంత్రి విడదల రజిని ఇంటివైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసిపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు సర్ధి చెప్పడంతో అక్కడి నుండి ఎన్‌ఆర్‌టి సెంటర్‌, కళామందిర్‌, ఎన్‌జిరంగా బొమ్మ వరకు సాగింది. మల్లెల స్థానంలో గుంటూరు మేయర్‌ కావటి మనోహరనాయుడును నియమిస్తూ అధిష్టానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళన చెందిన కొంత మంది కార్యకర్తలు ఎన్‌ఆర్‌టి సెంటర్‌లో మోటార్‌ సైకిల్‌ను దహనం చేశారు. నిరసన ర్యాలీలో 6, 7, 10, 12 వార్డుల కౌన్సిలర్‌లు గోల్డ్‌ శ్రీనివాసరావు, శివపార్వతి, బేరింగుల మౌలాలి, గోపి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️