మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రసంగాలు

Apr 29,2024 09:08 #parakala prabhaakar, #speech

-దేశాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్తున్న బిజెపి
– ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ ఆందోళన
ప్రజాశక్తి-నెల్లూరు :ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు మతవిద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేస్తున్నారని, దీనిని ప్రజలు క్షమించరని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ పేర్కొన్నారు. భారతదేశం శతాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ‘నేటి భారతం- సవాళ్లు’ అన్న అంశంపై ఆదివారం నిర్వహించిన సదస్సుకు డాక్టరు రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టరు బి రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ముఖ్యవక్తగా పరకాల మాట్లాడుతూ గడిచిన పదేళ్లగా దేశ ఆర్థిక వ్యవస్థ, మన రాజ్యాంగ విలువలు, విధ్వంసానికి గురయ్యాయని, ప్రభుత్వం, అధికార పక్షం దేశాన్ని విధ్వంసంవైపు తీసుకెళ్తున్నాయని వివరించారు. మణిపూర్‌ ప్రాంతంలో విధ్వంసం జరిగితే మనకేంటి అనుకోవడం సరికాదన్నారు. అక్కడ జరుగుతున్న మారణకాండ, మారణహోమం మిగిలిన రాష్ట్రాలలో జరిగేటటువంటి అతిపెద్ద ప్రమాదం దేశంలో పొంచి ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం ప్రబలిపోయిందని, ధరలు అదుపులో లేవన్నారు. అధికార పార్టీకి ఓట్లు వేసి తిరిగి అధికారాన్ని కట్టబెడితే దేశం సంక్షోభంలో పడుతుందన్నారు. ప్రధాన మంత్రి బయట మాట్లాడటం కాదు.. ఆగస్టు 15న ఏకంగా ఎర్రకోట మీదకు ఎక్కి ఇటువంటి పిలుపునిచ్చే ప్రమాదం ఉందని పిలుపునిచ్చారు. దేశ రాజ్యాంగ విలువలను, ఆర్ధిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థను కాపాడుకోవాలంటే నేడు అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ఇంటికి పంపించి తీరాల్సిందేనని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ట్రస్టు చైర్మన్‌ చండ్ర రాజగోపాల్‌ మాట్లాడుతూ ఏ దేశంలో లేనివిధంగా భారతదేశం పెనుప్రమాదంలో చిక్కుకు పోయిందన్నారు. ప్రజలకు అర్ధమయ్యే విధంగా తెలియజేసి చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎస్‌.అంకయ్య పాల్గొన్నారు.

➡️