ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధులకు వాలంటీర్లను ఖచ్చితంగా దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాలంటీర్లకు ఎన్నికల విధులను అప్పగించకూడదని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లను అనుమతించవద్దని ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ విధులు నిర్వర్తించాలన్న అంశంపై కూడా స్పష్టత ఇచ్చింది. వారికి ముఖ్యమైన ఎన్నికల పనులు కేటాయించకూడదని, ఓటు వేసిన వారికి సిరా గుర్తు పెట్టడం వంటి విధులను మాత్రమే కేటాయించాలని పేర్కొంది. ఒక పోలింగ్ బూత్కు సంబంధించిన ఎన్నికల బృందంతో ఒకరికి మించి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉండకూడదని తెలిపింది. . బిఎల్ఓలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని, వారికి పోలింగ్ రోజు ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఇసి సూచించింది.