సంక్రాంతి వేళ … ఎపిలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందేల జోరు

Jan 15,2024 13:39 #AP, #hens, #race

ఉభయ గోదావరి జిల్లా : సంక్రాంతి వేళ … ఎపిలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందేలు యథేచ్ఛగా జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లాయి. గత ఏడాది కోడి పందేలు, గుండాటలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ సంవత్సరం పర్మిషన్‌ ఇవ్వడంతో పందెంరాయుళ్లు ఆనందంతో పొంగిపోయారు. కారు రాజా కారు అంటూ కోట్ల రూపాయల పందేలు కాశారు. కోనసీమ జిల్లా అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో కోడిపందేల బరులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక కోడి పందేల ముసుగులో గుండాటలు కూడా జోరుగా జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 250 చోట్ల కోడి పందేలు జరుగుతున్నాయి. భారీగా నగదు చేతులు మారుతోంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. చీకటి పడ్డా కోళ్ల పందేలు సాగుతున్నాయి. పందెం రాయుళ్లు తగ్గేదే లా అంటూ పందేలు కాస్తున్నారు. ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో పెరూ కోళ్లు, క్రాస్‌ బ్రీడ్‌ కోళ్లతో పందేలు వేస్తున్నారు పందెం రాయుళ్లు. పెరూ కోళ్లతో లోకల్‌ కోళ్లు చూసుకుందాం రా … అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో కార్పొరేట్‌ స్థాయిలో కోడిపందాలు జరుగుతున్నాయి. పోలీస్‌ ఆంక్షలు బేఖాతర్‌ అయ్యాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర నెక్ట్స్‌ లెవెల్‌కు చేరింది. మనల్నెవడ్రా ఆపేది.. అంటూ కత్తులు కట్టుకుని కాలుదువ్వుతున్నాయి పందెం కోళ్లు. దెందులూరు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, జంగారెడ్డి గూడెం.. ఇలా అనేక చోట్ల బరులు సిద్ధ చేసి తగ్గేదే లే అంటున్నారు. కొన్నిచోట్ల ప్రజా ప్రతినిధులే తొలి పందేన్ని ప్రారంభించారు.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ గుండాట ఆడారు. మలికిపురంలో కోడిపందాలు, గుండాటలు ప్రారంభించిన ఎమ్మెల్యే రాపాక స్థానికులతో కలిసి గుండాటలో సరదాగా తనూ ఒక చెయ్యేశారు. జూదం ఆడి.. కొంత డబ్బు కూడా పోగొట్టుకున్నారు. ఇక కోడి పందేలకు దీటుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గుండాటల కూడా కొనసాగుతున్నాయి. చాలా చోట్ల జరుగుతున్న ఈ గుండాటల్లో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. పోలీసుల ఆంక్షల్ని నిర్వాహకులు ఏమాత్రం లెక్కచేయడం లేదు. ఇక అమలాపురంలో డింకీ పందేలు వేస్తూ జనం ఎంజాయ్ చేశారు.

➡️