ప్రజాశక్తి-విశాఖ : వైఎస్ఆర్ పేరును చార్జిషీట్లో పెట్టించినందుకే పొన్నవోలుకి ఏఏజీ పదవి దక్కిందని షర్మిలా ఆరోపించారు. విశాఖపట్టణంలో మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. అక్రమాస్తుల కేసులో వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును సీబీఐ తొలుత చేర్చలేదని.. ఆ తర్వాత జగన్ ఆదేశాలతోనే ఎఫ్ఐఆర్లోకి ఆయన పేరు ఎక్కిందని..వైఎస్సార్ పేరును పొన్నవోలు సుధాకర్రెడ్డి చేర్చారని ఆరోపించారు. ఈ కేసు నుంచి జగన్ను బయటపడేసేందుకు ఇలా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్ సీఎం పదవి చేపట్టిన ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి దక్కిందని తెలిపారు. వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధమూ లేకపోతే హడావుడిగా ఏఏజీ పదవిని ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. తండ్రి పేరును చార్జ్షీట్లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని షర్మిల ప్రశ్నించారు.