జగన్‌ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు 

మాజీ మంత్రి గంటా

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాయమాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ ప్రజలు లేరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఎంవిపి.కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్‌కు వారం రోజులు గడువు ఉండగా విశాఖ విజన్‌ పేరిట జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన వివరాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. గడిచిన ఐదేళ్లలో గుర్తుకురాని విశాఖ అభివృద్ధి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎందుకు గుర్తుకు వచ్చిందో అర్థం కావడంలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేయని జగన్‌ విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి తన నివాసం కోసం రుషికొండను బోడి గుండు చేసి నిర్మించుకున్న రూ.500 కోట్ల భవంతి తప్ప విశాఖలో మరెక్కడా ఏ నిర్మాణమూ జరగలేదని చెప్పారు. విశాఖ ప్రజలకు తమ నాయకులుగా ఎవరిని ఎన్నుకోవాలో తెలుసన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖపట్నంలో అభివృద్ధి అంతా టిడిపి హయాంలో జరిగినదేనని తెలిపారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.

➡️