ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్ప్లాంట్పై రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1178వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ ఎంఎంఎస్ఎం, ఎస్టిఎం విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్ప్లాంటును పరిరక్షించడానికి నీతినిజాయితీగా ముందుకు వచ్చే వారికే ఉక్కు కార్మికులు, నిర్వాసితుల మద్దతు ఉంటుందన్నారు. విశాఖ ఉక్కును అన్ని విధాలుగా నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ, స్టీల్ యాజమాన్య కుట్రలను తిప్పికొట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకోసం జరిగే పోరాటాలను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.