- ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదరరావు కోరారు. ఎన్నికల విధులు కేటాయించటం వల్ల ఏ ఒక్క ఉద్యోగీ తన ఓటు హక్కును కోల్పోరాదని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఇసిని కోరారు. నియోజకవర్గాల పరిధిలో ఎంతమంది ఉద్యోగులను ఎన్నికల విధులకు కేటాయించారు? ఎంతమందికి ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఆర్ఒలు ఇవ్వబోతున్నారో నేటికీ స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల కొత్తగా ఎన్నికల విధులకు కేటాయించబడ్డ ప్రతి అంగన్వాడీ, కాంట్రాక్టు ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు.