హైదరాబాద్ : తెలంగాణ నూతన సీఎంగా రేవంత్రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలను రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు.ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, టిడిపి అధినేత చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు పంపారు. సీనియర్ నేతలు చిదంబరం, అశోక్ గహ్లౌత్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మీరాకుమార్, కుంతియా, భూపేష్ బఘేల్, అశోక్ చవాన్, వాయలార్ రవి, సుశీల్కుమార్ శిందే, మాణికం ఠాగూర్, కురియన్ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యలతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. పలువురు సినీ ప్రముఖులకు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/reventh-1.jpg)