ఆగివున్న లారీ ని ఢీకొన్న మరో లారీ
ఇద్దరు వ్యక్తులు మృతి
ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీ ని వెనుక నుండి మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, క్లినర్ మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా మార్టూరు సమీపంలోని రాజుపాలెం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ ముసలం శ్రీనివాసరావు కధనం ప్రకారం విజయవాడ నుండి మధురై కి స్టీల్ లోడుతో వెళుతున్న లారీ రాజుపాలెం వద్ద టైర్ పంచర్ అవడంతో నడి రోడ్డుపై నిర్లక్ష్యం గా నిలిపి మధురై కి చెందిన క్లినర్ రాజు (55) తో టైర్ మార్పిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా టంగుటూరు కి చెందిన మరో లారీ అదే రూట్ లో వస్తూ జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీ ని మంచు వల్ల గుర్తించలేక బలంగా డీ కొట్టాడు. ఈ ప్రమాదంలో టైర్ మారుస్తున్న రాజు, టంగుటూరు కి చెందిన డ్రైవర్ మేడవరపు అజయ్ సురేష్ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకొని ట్రఫిక్ కి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. లారీ లోని మృత దేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. రెండు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.