ప్రజాశక్తి-వేపాడ : సిఎం పర్యటన సందర్భంగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి విజయనగరం జిల్లా వేపాడ మండలంలో కూడా చోటుచేసుకున్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో ఎప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసిన విద్యార్థులకు వస్తున్న బడి బస్సులు ఎస్ కోట డిపో నుండి సమావేశాలకు జనాలను తరలించుటకు ఉపయోగించుకోవడంతో ఆరోజు ఆటోలను ఆశ్రయించవలసినదే. ఇదే అదునుగా ఆటో డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేయడం మొదలు పెడతారు, వేపాడ మండల కేంద్రమైన బక్కు నాయుడుపేట వద్ద గల ఏపీ ఆదర్శ పాఠశాలకు బొద్దాం, పాటూరు, జాకేరు, సోంపురం, గుడివాడ, దబ్బిరాజుపేట, సింగరాయి, ఆతవ, బాణాది, బల్లంకి, కె ఆర్ పేట, వావిలపాడు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడక తప్పదు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం అంటే ఇదేనా, పైకి చెప్పేది ఒకటి ఆచరించేది ఒకటి అంటూ విద్యార్థుల పేరెంట్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశాలు ఏర్పాటుకు బస్సులు ఉపయోగించుకోవడం వలన ఆ పూట బడి మానివేసిన పరిస్థితి కూడా జరుగుతుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు.