హైదరాబాద్‌లో తీవ్ర విషాదం – గోడకూలి ఏడుగురు మృతి

తెలంగాణ : మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఏడు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల పేర్లు రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4), తిరుపతిరావు (20), శంకర్‌ (22), రాజు (25), ఖుషిగా గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా రేణుక ఎల్లమ్మ కాలనీ వద్ద హరిజన్‌ డెవెలపర్స్‌ కన్‌స్ట్రక్షన్‌ లో ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్‌ పని చేస్తున్న కార్మికులుగా తెలుస్తోంది. కార్మికులు ఉంటున్న షెడ్‌పై రిటైనింగ్‌ వాల్‌ కూలి పడడంతో ఈ విషాదం జరిగింది. మృతులంతా ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూకట్‌ పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు.

➡️