అర్చకుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:కాకినాడలో అర్చకుడిపై దాడిచేసిన వైసిపి కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారమదంతో ఆలయ పూజారులపై దాడులు చేయడం, దుర్భాషలాడేవారి పట్ల ఉదారంగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వైసిపి మాజీ కార్పొరేటర్‌ను అరెస్టు చేయకుండా దేవాదాయశాఖ అధికారుల ద్వారా రాజీ నాటకాలు ఆడించి రహస్య క్షమాపణలు చెప్పించడం, తాను క్షమాపణ చెప్పలేదని చంద్రరావు చెప్పడం అనమానాస్పదంగా ఉందని అన్నారు. తమకు రక్షణ లేదని పూజారి కుటుంబం చెబుతుందన్నారు. నిందితుడిపై 47ఏ నామమాత్రపు సెక్షన్‌ బుక్‌ చేసిందన్నారు. పూజారి కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను ఆసరా చేసుకుని కొన్ని స్వార్థపర రాజకీయ శక్తులు మత ఉద్రేకాలు సృష్టించే ప్రయత్నాలను అధికార యంత్రాంగం నిరోధించాలని శ్రీనివాసరావు కోరారు.

➡️