విశాఖ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. నేడు విశాఖ శివాజీనగర్లో ప్రారంభించిన 226వ యువగళం పాదయాత్రలో లోకేశ్తోపాటు తల్లి భువనేశ్వరి, అత్త వసుంధర, ఇతర కుటుంబసభ్యులు కలిసి నడిచారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. నేటితో ఈ పాదయాత్ర ముగియనుండగా… పైలాన్ను లోకేశ్ ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. 97 నియోజకవర్గాల్లో సాగింది. 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభను టిడిపి భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈరోజు మధ్యాహ్నం అగ్రిగోల్డ్ బాధితులు, మీ సేవా నిర్వాహకులతో లోకేశ్ ముఖాముఖిగా సమావేశం కానున్నారు. తరువాత కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఈరోజు సాయంత్రం స్టీల్ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో లోకేశ్ భేటీకానున్నారు.