రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు .. కాంగ్రెస్‌ అభ్యర్థులకు హైకమాండ్‌ అలర్ట్‌..

తెలంగాణ : తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న వేళ …. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ అన్ని పార్టీల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.

అభ్యర్థులకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశం…

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ యుద్ధం నెలకొందని… హంగ్‌ వచ్చే అవకాశముందని కొన్ని సర్వేలు చెప్పగా.. మరికొన్ని సర్వేలు కాంగ్రెస్‌ దే పై చేయిగా ఉంటుందని ప్రకటించాయి. అయితే, కాంగ్రెస్‌ గెలుస్తుందన్న ఊహగానాల మధ్య కాంగ్రెస్‌ హై కమాండ్‌ అప్రమత్తమయ్యింది. గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత అనుభవాలను దఅష్టిలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో పరిస్థితిని పరిశీలించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపిస్తోంది. సాయంత్రం వరకు డీకే శివకుమార్‌ హైదరాబాద్‌ కు రానున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు కాంగ్రెస్‌ పార్టీ పలు సూచనలు చేసింది.. గెలిచిన అభ్యర్థులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ కు రావాలని ఆదేశించింది. రేపు ఉదయాన్నే చిదంబరం, షిండే, సూర్జేవాలా హైదరాబాద్‌కు రానున్నారు. ఏఐసీసీ పెద్దలు ఎన్నికల ఫలితాలపై పరిశీలన జరపడంతోపాటు గెలిచిన అభ్యర్థులకు పలు సూచనలు చేయనున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

➡️