ప్రజాశక్తి – గోనేగండ్ల (కర్నూలు) : బంగారం, డబ్బు కోసం నానమ్మను మనవడు కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు… పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మ (82) కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు చనిపోయారు. ప్రస్తుతం ఆమె తన పెద్ద కుమారుడు కురువ బజారి దగ్గర ఉంటున్నారు. బతుకుతెరువు కోసం పెద్దకుమారుడు వేరే ప్రాంతానికి వలస వెళ్లారు. దీంతో, మనవడు వెంకటేష్తో కలిసి నాగమ్మ ఉంటున్నారు. చెడు అలవాట్లకు బానిసైన వెంకటేష్… నానమ్మ వద్ద ఉన్న బంగారం, నగదుపై కన్నేశాడు. ఈ క్రమంలో ఈ నెల నాలుగున నానమ్మను గొంతు నులిమి చంపి గుట్టుచప్పుడు కాకుండా ఇంటి ఆవరణంలోనే పాతిపెట్టాడు. ఆమె దగ్గర ఉన్న మూడు తులాల బంగారు, రూ.15 వేలు నగదును కాజేశాడు. తిరిగి సొంతూరికి వచ్చిన బజారికి తన తల్లి కనిపించకపోవడంతో కుమారుడు వెంకటేష్ను ప్రశ్నించాడు. తనకేమీ తెలియదని కుమారుడు బుకాయించాడు. తల్లి కనిపించడం లేదని ఈ నెల 13న పోలీసులకు బజారి ఫిర్యాదు చేశారు. వెంకటేష్ కదలికలపై పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారణ చేశారు. డబ్బు, బంగారం కోసం తానే నానమ్మను చంపినట్టు వెంకటేష్ ఒప్పుకున్నాడు. ఇంటి ఆవరణంలో పాతిపెట్టిన నాగమ్మ మృతదేహాన్ని శనివారం పోలీసులు వెలికితీసి ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. వెంకటేష్పై హత్య కేసు నమోదు చేసినట్లు సిఐ రామకృష్ణయ్య తెలిపారు.