ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఎ) ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావుతో ఎస్ఎస్ఎ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జెఎసి ప్రకటించింది.
ఉద్యోగులకు హెఆర్ పాలసీ అమలుపై కమిటీ నియమిస్తామని, అలాగే పిఎఫ్, మినీమం టైం స్కేల్ దశల వారీ అమల్జేస్తామని, 10 విభాగాల ఉద్యోగులకు వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు జెఎసి అధ్యక్షులు బి కాంతారావు చెప్పారు. అలాగే సమ్మె కాలానికి వేతనం ఇచ్చేందుకు, ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను, షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చర్చల్లో సమగ్ర శిక్ష ఎఎస్పిడి శ్రీనివాసులు రెడ్డి, కెజిబివి కార్యదర్శి మధుసూధనరావు, జెఎసి చైర్మన్ ఎవి నాగేశ్వరరావు పాల్గొన్నారు.