ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ పోరాటంలో ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు రామస్వామి పిలుపునిచ్చారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ కూర్మన్నపాలెంలో పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు సోమవారంనాటికి 1131వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్, క్యూఎటిడి, ఆర్ అండ్ డి, టెలికం, ఇటిఎల్, డిఎన్డబ్ల్యు విభాగాల కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి రామస్వామి మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకొని తీరుతామన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఒకే ఒక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ప్లాంట్ మాత్రమేనని, దీని చుట్టూ ఉన్న విలువైన భూముల కోసం అనేక ప్రయివేటు సంస్థలు పోటీ పడుతున్నాయని తెలిపారు. ప్రజాధనంతో నిర్మించుకొని విలువ పెంచుకున్న భూములను ప్రజలే కాపాడుకోవాలని కోరారు.