ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మహిళలు అని చూడకుండా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. టిడిపి కార్యకర్తలు హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాపై, ఎచ్చెర్లలో జడ్పిటిసి హేమమాలినిరెడ్డిపై దాడులు చేశారని అన్నారు. జగన్పై ఎన్డిఎ కూటమి కక్ష కట్టిందని వైసిపి మహిళా విభాగపు అధ్యక్షులు, ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. అధికారంలోకి వస్తే విద్యారంగంలో తెచ్చిన మార్పులన్నిటినీ రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించడం తగదని వైసిపి అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ అన్నారు. మరోసారి జగన్ను గెలిపించుకోవాలని రాష్ట్ర నూర్ భాష సంఘం నాయకులు దస్తగిరి అన్నారు.
ప్రజలను ఓట్లడిగే అర్హత చిరంజీవికి లేదు : పోసాని
ప్రజారాజ్యం పార్టీ పెట్టి అర్ధాంతరంగా దానిని కాంగ్రెస్లో విలీనం చేసి, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా వున్న చిరంజీవికి, తన తమ్ముడు పవన్కల్యాణ్ను గెలిపించాలని ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని సినీ నటులు, వైసిపి నాయకులు పోసాని కృష్ణమురళి అన్నారు. ప్రజలు 18 మంది ఎమ్మెల్యేలను ఇస్తే గంపగుత్తగా కాంగ్రెస్కు అమ్మేసి బిజినెస్మెన్గా మారారని చెప్పారు.