ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం):దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ స్టీల్ప్లాంట్ను పోరాటాలతో కాపాడుకుంటామని సిఐటియు అక్కయ్యపాలెం జోన్ నాయకులు జి అప్పలరాజు, యుఎస్ఎన్ రాజు అన్నారు. స్టీల్ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి 1002వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో సిఐటియు అక్కయ్యపాలెం జోన్ కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ రూ. కోట్ల విలువైన, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ప్లాంట్ను ప్రయివేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. ఉక్కు కర్మాగారం వల్లే విశాఖ ఇంతలా అభివృద్ధి చెందిందని తెలిపారు. త్యాగాలతో ఏర్పడిన ప్లాంట్కు మరింత ఊతమిచ్చి, సొంత గనులు కేటాయించాల్సిందిపోయి నిర్వీర్యం చేసేలా మోడీ సర్కారు నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమన్నారు. ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గకుంటే రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దీక్షల్లో నాయకులు రాము, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.