ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసిపి ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల.. పార్టీ కండువా కప్పి ఆయన్ను ఆహ్వానించారు. హైదరాబాద్లోని బేగంపేటలో మంగళవారం షర్మిలను ఆర్థర్ కలిసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ప్రకటించిన వైసిపి అభ్యర్థుల జాబితాలో ఆర్థర్కు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో సుధీర్ దారాకు టికెట్ దక్కింది. జనవరిలో ప్రకటించిన సమన్వయకర్తల నియామకం సమయంలోనే సుధీర్ దారాను నందికొట్కూరు వైసిపి సమన్వయకర్తగా పార్టీ ప్రకటించింది. ఆ సమయంలోనే ఎమ్మెల్యే ఆర్థర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ఆర్థర్ 38 వేలకుపైగా ఓట్లతో సమీప టిడిపి అభ్యర్థిపై గెలుపొందారు. శ్రీకాళహస్తి టెంపుల్ మాజీ ఛైర్మన్ పొతుగుంట గురవయ్య నాయుడు కుమారుడు డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు కూడా వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేష్ నాయుడుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉంది.