ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : సిపిఐ మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పని చేస్తున్న ఆరుగురు మావోయిస్టులు సోమవారం ఉదయం విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా విశాల్గున్ని, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాకు చెందిన ఆరుగురు మావోయిస్టులు తమ వద్ద లొంగిపోయారని, ప్రస్తుతం దళాల్లో రోజురోజుకూ పరిస్థితులు బలహీనంగా మారడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతిఫలాలు అందేలా చూస్తామని అన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు వీరే..
కిష్టారం ఏరియా కమిటీ సెక్రటరీ కుహరం మిదిలేష్ అలియాస్ రాజు, ఏరియా కమిటీ సభ్యులు బరసే మాసా, వంజం రామే అలియాస్ కమల, మడక్కం సుక్కి, దుడి సోని, కొంట ఏరియా కమిటీ సభ్యులు వేట్టి బీమా ఉన్నారు. వీరు పోలీసులను లక్ష్యంగా చేసుకుని పలు దాడుల్లో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. వారిపై ఉన్న రివార్డులను తెలియజేశారు.