హైదరాబాద్ : ఆగస్టు 15లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించినట్లు తెలిపారు. సవాల్పై శుక్రవారం అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేస్తానని.. ఒకే విడతలో రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను డిసెంబర్ 9న అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఆ మాట తప్పింది. అధికారంలోకి వచ్చి 120 రోజులైంది.. మీ గ్యారంటీలు ఏమయ్యాయి?మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2500, రైతులకు రూ.15,000, నిరుద్యోగులకు భృతి ఎందుకు ఇవ్వలేదు? అని హరీశ్రావు ప్రశ్నించారు.