సిద్దిపేట : ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేల జీవనభ్రుతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేట్ సోసైటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్కు నిర్వహించిన ఆటల పోటీల్లో హరీష్ రావు పాల్గన్నారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శం అని పేర్కొన్నారు. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. సిద్దిపేటకు వారు బ్రాండ్ అంబాసిడర్లు అని కొనియాడారు. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారు అని ప్రశంసించారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మంచి కార్యక్రమం. కానీ ఒకరికి మంచి చేయాలనే ఉద్దేశంతో మరొకరి కడుపు కొట్టద్దన్నారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలోని 6 లక్షల మంది డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని తేల్చిచెప్పారు.ఈ ఆటల పోటీలు ఆటో డ్రైవర్ల ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహపడుతాయన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులు, ఆరోగ్యానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇలా ఆటల పోటీలు నిర్వహిస్తూ, మంచి అలవాట్లు అలవర్చుకోవడం మంచి పరిణామం అన్నారు. సిద్దిపేట స్పోర్ట్స్ హబ్గా మారింది అని హరీశ్రావు తెలిపారు.