న్యూఢిల్లీ : సంపన్నులపై పన్ను విధించడం ద్వారా మాత్రమే వృద్థి వేగాన్ని పెంచలేమని ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నార్త్వెస్టర్న్ యూనివర్శిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజన్ మాట్లాడుతూ.. సమ్మిళిత వృద్థిపై దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే జిడిపిని వేగంగా పెంచగలమన్నారు. విజయంతమైన వారిని కిందికి లాగడం కంటే క్రింది వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించాలన్నారు. అమెరికాలో వారసత్వపు పన్ను అంశంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజన్ మాట్లాడారు. మణిపూర్లో జాతి కలహాల గురించి మాట్లాడుతూ.. భారతదేశం లో జరుగుతున్నది ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు రెండు వర్గాల మధ్య పోరాటం కాదని రాజన్ పేర్కొన్నారు. ఉద్యోగాలు, రిజర్వేషన్ల కోసం ఒక వర్గానికి చెందిన వారి కంటే మరో సామాజికవర్గం ఎక్కువ పొందుతున్నట్లు భావించడం వల్లే ఆందోళనలు నెలకొన్నాయన్నారు.