ప్రజాశక్తి – నెల్లిమర్ల : మానవ మనుగడకు పరిశోధనలు అత్యంత కీలకమని ఐసిజిఇబి (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ) డైరెక్టర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, సెంచూరియన్ విశ్వ విద్యాలయంలోని స్మార్ట్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కలసి సంయుక్తంగా నిర్వహించిన మిపామ్-2024 (ఇంటరాక్టివ్ మీట్ ఆన్ మోలిక్యులర్ ఇంట్రికసీస్ ఆఫ్ ప్లాంట్) సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఆహార ధాన్యాల దిగుబడులు అధికంగా ఉండాలంటే పంటకు చీడ, పీడల బెడద ఉండరాదన్నారు. వీటిపై విస్తృత పరిశోధనలు జరిపి దిగుబడులు పెరిగేలా చూడాలన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వృక్ష శాస్త్రవేత్తలు, పరిశోధకులు కలసి పరస్పర శాస్త్రీయ చర్చలు జరపడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికి ముఖ్యమైన ప్రాంతీయ సమస్యలను చేపట్టేందుకు యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి వీడియో సమావేశంలో మాట్లాడుతూ ఈ రంగంలో పనిచేస్తొన్న శాస్త్రవేత్తలు విభిన్న సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. సెంచూరియన్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి మాట్లాడుతూ పరస్పర సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుష్పలత, డాక్టర్ అనిరుద్ద్ కుమార్, డాక్టర్ సురేంద్ర కుమార్ రారు తదితరులు ప్రసంగించారు. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మోలిక్యులర్ బయోలజీ, తేజ్ పూర్ విశ్వవిద్యాలయం, ఐసిజిఇబి, డిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటి గౌహతి, ఆర్సిబీ ఫరీదాబాద్ తదితర ప్రాంతాల నుంచి పలువురు పరిశోధకులు, గిరిజన విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ శరత్ చంద్ర, ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా, ప్రొఫెసర్ పి.శ్రీదేవి, డాక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/nml-senchu-1.jpg)