అనంతపురం జిల్లా ఎస్ఆర్ఐటి కళాశాలలో ఏపీ ఈసెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న జెఎన్టియు విసి జివిఆర్.శ్రీనివాసరావు
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, అనంతపురం జెఎన్టియు సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఏపీ ఈసెట్-2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో 93, హైదరాబాద్లో 2 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు విదతలుగా పరీక్షలు జరిగాయి. పరీక్షలకు 37,767 మంది దరఖాస్తు చేసుకోగా 36,369 మంది హాజరు అయ్యారు. 1398 మంది గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 96.42 శాతం, హైదరాబాద్లో 93.32 శాతం హాజరు నమోదు అయ్యింది. అందరి సహకారంతో ఏపీ ఈసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఏపీ ఈసెట్ కన్వనర్ పిఅర్.భానుమూర్తి తెలిపారు. 10వ తేదీన ఏపీ.ఈసెట్ వెబ్సైట్లో ప్రాథమికకీని అందుబాటులో ఉంచుతామన్నారు. కీలో ఏమైనా తప్పులుంటే 12వతేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ఎస్ఆర్ఐటి ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను జెఎన్టియు ఉపకులపతి జివిఆర్ శ్రీనివాసరావు, ఈసెట్ కన్వీనర్ పిఆర్.భానుమూర్తితనిఖీ చేశారు.