నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి

Nov 24,2023 15:55 #Anantapuram District

ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల

ప్రజాశక్తి-రాయదుర్గం : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 8 నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాల కేంద్రాలలో నిర్వహిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షురాలు శకుంతల తెలిపారు. శుక్రవారం రాయదుర్గం ప్రాజెక్ట్ నందు వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శకుంతల మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అనేక సమస్యలతో కొట్టుమిట్టలాడుతున్నారని అన్నారు. అదేవిధంగా అంగన్వాడి వర్కర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. అందుకనే తప్పని పరిస్థితుల్లో అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు తమ సమస్యలు పరిష్కారం కోసం ఈ నిరవధిక సమ్మెను చేయాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ స్పందించి అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న వేతనాన్ని అదనంగా 1000 రూపాయలను పెంచాలని, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీలను ఉద్యోగులుగా గుర్తించాలని, ఐసిడిఎస్ సంస్థను ప్రైవేటుపరం చేసే ఆలోచనను విరమించుకోవాలని, తదితర డిమాండ్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి వర్కర్లు చేసినటువంటి సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు మరియు ప్రజలు తమ యొక్క సంపూర్ణ మద్దతును తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ సీనియర్ రాయదుర్గం ప్రాజెక్టు కార్యదర్శి మేరీ, మరియు నాయకురాలు రాధా, రాధిక, మెహ్రూన్, గోవిందమ్మ, రుద్రమ్మ, అనురాధ, కృష్ణవేణి, రూప, చంద్రకళ మరియు అంగన్వాడివర్కర్లు పాల్గొన్నారు.

➡️