ఆ స్థాయి అనురాధకు లేదు: జంజనం

ప్రజాశక్తి-చీరాల: చీరాల మాజీ శాసనసభ్యులు, సీనియర్‌ రాజకీయ నాయకులు కరణం బలరామ కృష్ణమూర్తిని విమర్శించే స్థాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు లేదని మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల వచ్చిన ఎమ్మెల్సీ అనురాధ విలేకరుల సమా వేశంలో తమ నాయకులు కరణం బలరాంపై చేసిన విమర్శలను ఖండిస్తూ మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. 2019 ఎన్నికలలో బలరాం టిడిపిలో గెలిచినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం పార్టీ మారారే తప్ప వ్యక్తిగత వ్యాపారాల కోసం కాదని అన్నారు. అలాంటివి ఆయన చరిత్రలో లేవని పేర్కొన్నారు. చీరాల ప్రజలు కరణం బలరామకృష్ణమూర్తి పాలనలో ఎంతో ప్రశాంతం గా ఉన్నారన్నారు. మంచి వాతావరణంలో రాజకీయ ప్రచారాలు చేసుకోవాలే కానీ రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చ రించారు. చదుకున్న మహిళగా అనురాధ అంటే గౌరవం ఉందని, మరోసారి ఇలాంటి అవాకులు చవాకులు పేలితే చీరాల చేనేత మహిళలు బుద్ధి చెప్పాల్సి వస్తుందని అన్నారు. సమావేశంలో చేనేత నాయకులు బండారు జ్వాల, మాజీ కౌన్సిలర్‌ కల్లగుంట అంజమ్మ, గుంతి శ్రీను, చిలకోటి శ్రీను పలువురు పాల్గొన్నారు.

➡️