ప్రజాశక్తి -తగరపువలస : ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే భీమిలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి నాగోతు నాగమణి చెప్పారు. స్థానిక ప్రయివేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. దాదాపు 5నెలల పాటు నియోజకవర్గంలో జరిపిన క్షేత్ర స్థాయి పర్యటనలో ఎన్నో సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వివరించారు. అనేక గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలులేవన్నారు. ముఖ్యంగా పలు గ్రామాల్లోని దళిత వాడలు ఎన్నో అభివృద్ధికి దూరంగా ఉన్నాయని అవేదన వ్యక్తంచేశారు. తనకు ఎన్నికల సంఘం కేటాయించిన బకెట్ గుర్తుపై ఓటు వేసి భీమిలి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు.