బిజెపి తొత్తులుగా మారిన వైసిపి, టిడిపిలను ఓడించాలి : సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు

గన్నవరం (కృష్ణా) : వైసిపి, టిడిపి పార్టీలు బిజెపికి తొత్తులుగా మారాయని, స్వార్థ ప్రయోజనాల కోసం బిజెపి బలపడటానికి ఆయా పార్టీల అధినేతలు తోడ్పడుతున్నారని సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇలాంటి పార్టీలను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. గన్నవరం మండలం బుద్ధవరం పంచాయతీ పరిధిలోని దావాజీగూడెం గ్రామంలో శనివారం ఆయన వామపక్ష నాయకులతో కలిసి విస్తఅత ప్రచారం నిర్వహించారు. మహిళలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ … రాష్ట్రంలో ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎర్రజెండా పోరాటం చేస్తుందని, దానికి అందరూ అండగా నిలవాలని కోరారు. 375 పార్లమెంటు సీట్లు బిజెపికి ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తారని.. ఇది మోడీ మాటల్లో అర్ధమవుతోందన్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం ఉండదని ఆందోళని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 23వ తేదీన తాను నామినేషన్‌ వేస్తున్నానని, ఆ కార్యక్రమానికి వామపక్ష, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో వామపక్ష నాయకులు మీరా ఖాన్‌, మరియమ్మ, చిన బాజీ, కొండా వీరాస్వామి, ఆరేపల్లి మోహన రావు, బడుగు మరియదాసు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

➡️