ప్రజాశక్తి – కలిదిండి
ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళీరావు అన్నారు. మండలంలోని మూలలంకలో ఉపాధి కూలీలను కలిసిన ఆయన కాంగ్రెస్ ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యను, కాంగ్రెస్ కైకలూరు నియోజకవర్గ ఎంఎల్ఎ అభ్యర్థి బొడ్డు నోబుల్ను గెలిపించాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 10 ఏళ్లలో ఉపాధి హామీ చట్టం నిధులు తగ్గించి, పేదల పొట్ట కొట్టిందన్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా, పోలవరం ప్రాజెక్టుకు, నిర్వాసితులకు నిధులు మంజూరు చేయకపోవడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రయివేటుపరం చేసి తీరని అన్యాయం చేసిందన్నారు. అందుకే బిజెపిని, బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేనను, బిజెపికి తొత్తుగా ఉన్న వైసిపిని ఓడించి ఇండియా వేదిక బలపరిచిన అభ్యర్థులైన బొడ్డు నోబుల్, కావూరి లావణ్యను గెలిపించేందుకు హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో నాయకులు ఎన్.మహాలక్ష్మి, ఎం.వెంకట లక్ష్మి పాల్గొన్నారు.